రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “ఎవరు ఎందుకు” ఫస్ట్ లుక్ విడుదల
జూలై 7, 2024 – వీటి ఎంటర్ప్రైజెస్ పతాకంపై రవి సిరోర్, నివిష్క పాటిల్ హీరో హీరోయిన్లుగా ఎస్.జి.ఆర్. దర్శకత్వంలో జి. వెంకటేష్ రెడ్డి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎవరు ఎందుకు” షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి నిన్న ఆవిష్కరించారు. అలాగే ఈ చిత్ర లిరికల్ సాంగ్ను ప్రొడ్యూసర్ కాన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో రవి సిరోర్, సంగీత దర్శకులు సతీష్ ఆర్యన్, సహనిర్మాతలు పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వినయ్ రెడ్డి, లేపాక్షి ఆలయ చైర్మన్ రామానంద్ శర్మ, కృష్ణంరాజు స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర శాస్త్రి, ఆర్టిస్ట్ శృతి తదితరులు పాల్గొన్నారు.
శ్యామలాదేవి ప్రసంగం
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ, “వెంకటేష్ రెడ్డి ప్రభాస్ ఫ్యాన్స్ హిందూపూర్ ప్రెసిడెంట్గా ఎప్పటినుంచి ఉన్నారు. ఆయన మా ఫ్యామిలీ మొత్తానికి అభిమాని. అటువంటి ఆయన ఈరోజు నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది ప్రముఖ నటుల ఫోటోల మధ్యన, ఫిలిం ఛాంబర్లో ఈ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ చూస్తుంటే మహానటుల దీవెన వీళ్లకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి సినీ పరిశ్రమకు ఒక డైరెక్టర్ రావాలి, ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక యాక్టర్ రావాలి. మాతోపాటు మా అభిమానులు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత వెంకటేష్ రెడ్డి మాటలు
నిర్మాత వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ, “మా ఆరాధ్య దైవం రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి చేతుల మీదుగా ఈరోజు మా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి కారకులైన మా కృష్ణంరాజు & ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా అధ్యక్షులు శాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఎంటర్టైనర్. చక్కటి మ్యూజిక్ కి స్కోపు ఉన్న చిత్రం. ఈ చిత్రం డెఫినెట్గా అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
డైరెక్టర్ ఎస్.జి.ఆర్ మాటలు
డైరెక్టర్ ఎస్.జి.ఆర్ మాట్లాడుతూ, “మా చిత్రం ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాము. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. అవి నేనే రాశాను. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రం చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రధాన పాత్రలు మరియు సాంకేతిక బృందం
రవి సిరోర్, నివిష్కా పాటిల్, అనురాధ, జగ్గప్ప తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సతీష్ ఆర్యన్, డి.ఓ.పి: ఎ.సి. మహేంద్రన్, ఎడిటర్: మను ఎస్రంగ కహలె, డ్యాన్స్: సై రమేష్, పి.ఆర్.ఓ: బి. వీరబాబు, కో ప్రొడ్యూసర్స్: పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి, కె. వినయ్ రెడ్డి, నిర్మాత: జి. వెంకటేశ్వర రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.జి.ఆర్.

